నేడు భారీ గ్రహశకలం భూమికి దగ్గరగా రాబోతుంది!
నేడు (మార్చి 16వ తేదీ) ఒక భారీ గ్రహశకలం భూమికి దగ్గరగా వెళ్లనుందని నాసా(NASA) తెలిపింది. కుతుబ్మినార్ కంటే రెట్టింపు పొడవు ఉండే ఈ గ్రహశకలం 61 మీటర్ల నుంచి 140 మీటర్ల వరకు ఉండవచ్చని అంచనా.
2024 సీజే-8 అని పేరు పెట్టబడిన ఈ గ్రహశకలం భూమికి 66 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి దూసుకువెళ్లనుంది. దీని వేగం గంటకు 43 వేల కిలోమీటర్లుగా ఉండనుందని నాసా ప్రకటించింది.
ప్రమాదకరమైనదా?
140 మీటర్ల కంటే ఎక్కువ సైజులో ఉండి, భూమికి 46 లక్షల కిలోమీటర్ల లోపు దూరం నుంచి వెళ్లే గ్రహశకలాలను ప్రమాదకరమైనవిగా పరిగణిస్తారు. 2024 సీజే 8 ఈ రెండు ప్రమాణాలకు దగ్గరగా ఉండడంతో, దీన్ని శాస్త్రవేత్తలు చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు.
భూమిని ఢీకొట్టే అవకాశం ఉన్న గ్రహశకలాలను గుర్తించడానికి శాస్త్రవేత్తలు భూమిపై ఉన్న టెలిస్కోపులు, అంతరిక్షంలో ఉండే పర్యవేక్షణా కేంద్రాలు, రాడార్ వ్యవస్థలను ఉపయోగిస్తారు.
మరొక గ్రహశకలం కూడా...
2024 సీజే8తో పాటు మరో చిన్న గ్రహశకలం కూడా భూమికి దగ్గరగా వెళ్లనుంది. దీనికి 2024 EK-4 అని పేరు పెట్టారు. దీని సైజు ఏడు నుంచి 14 మీటర్ల మధ్య ఉండవచ్చని నాసా అంచనా వేసింది. ఈ గ్రహశకలం భూమికి 40 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించనుంది.
గ్రహశకలాలను గుర్తించడంలో నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఈ నెల ప్రారంభంలో నాసా ఒక షాకింగ్ డేటాను విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం, 140 మీటర్ల కంటే ఎక్కువ సైజులో ఉండి, భూమికి దగ్గరగా ఉన్న 10,700 గ్రహశకలాలను గుర్తించినట్లు తెలిపింది. ఇంకా 14 వేల వరకు గుర్తించాల్సి ఉందని అంచనా.
భూమికి ప్రమాదం ఏమిటి?
2024 సీజే8, 2024 ఈకే4 గ్రహశకలాలు ఈసారి భూమిని ఢీకొనే అవకాశం లేదు. అయితే, భవిష్యత్తులో ఇటువంటి గ్రహశకలాలు భూమిని ఢీకొట్టే అవకాశం లేకపోలేదు. భవిష్యత్తులో గ్రహశకలాల బెదిరింపులను ఎదుర్కోవడానికి శాస్త్రవేత్తలు కొత్త పద్ధతులను అభివృద్ధి చేస్తున్నారు.
